Operation Sindoor: పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్'

Vivek Agnihotri Announces New Film Operation Sindoor on Pakistan Strikes
షార్ట్స్‌లో చూడండి
'ది కశ్మీర్ ఫైల్స్', 'ది వ్యాక్సిన్ వార్' వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. 'ఆపరేషన్ సిందూర్‌' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో చేతులు కలిపినట్లు ఆయన వెల్లడించారు. సరిహద్దు అవతల భారత సైన్యం నిర్వహించిన రహస్య సైనిక చర్యల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలిపారు.

ఈ సినిమా కథకు లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ 'టినీ' ధిల్లాన్ రాసిన "ఆపరేషన్ సిందూర్‌: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్థాన్" అనే పుస్తకం ఆధారం. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "ఉపఖండంలో భద్రతా నిర్వచనాన్ని మార్చేసి, పాకిస్థాన్ అణు బూటకాన్ని బట్టబయలు చేసిన కథ 'ఆపరేషన్ సిందూర్‌'. దీనికోసం నేను, భూషణ్ కుమార్ చేతులు కలిపాం" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కేవలం సంచలనం సృష్టించడానికి కాదని, వాస్తవాలను స్పష్టంగా సినిమా మాధ్యమం ద్వారా చెప్పడానికే ఈ సినిమా తీస్తున్నట్లు వివరించారు.

పుస్తకంలోని వివరాల ప్రకారం 2025 ఏప్రిల్ లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మేలో 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ఒక సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలపై భారత్ మిస్సైల్ దాడులు చేసింది.

ఈ వాస్తవ ఘటనల ఆధారంగా భారత సాయుధ దళాలలోని పలు విభాగాల నుంచి సమాచారం సేకరించి, క్షేత్రస్థాయిలో విస్తృతమైన పరిశోధన చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఉపఖండ భద్రతా పరిణామాలను మార్చేసిన ఈ సైనిక వ్యూహాలను వెండితెరపై ఆవిష్కరించడమే ఈ సినిమా లక్ష్యమని వివేక్ అగ్నిహోత్రి స్పష్టం చేశారు.
Go Back to Shorts
Operation Sindoor
Vivek Agnihotri
Bhushan Kumar
Kashmir Files
The Vaccine War
Indian Army
Pakistan
Surgical Strike
Terrorist Camps
Lt Gen KJS Dhillon

More Telugu News