డ్రంకెన్‌ డ్రైవ్‌లో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు.. మద్యం మత్తులో నడిరోడ్డుపై హల్‌చల్!

సంగారెడ్డి జిల్లాలో డ్రంకెన్‌ డ్రైవ్‌ ఘటన కలకలం సృష్టించింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ ప్రమాదానికి కారణమయ్యారు. అనంతరం స్థానికులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మల్లేపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. లావణ్య మద్యం సేవించి కారు నడుపుతూ వెళ్తుండగా మల్లేపల్లి వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టారు. ప్రమాదం జరిగినప్పటికీ ఆమె కారు ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అయితే, ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి, ఆమె కారును వెంబడించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో లావణ్యకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెతో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని లావణ్యకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, ఆమె పరిమితికి మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేశారు. అనంతరం కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ ఘటనతో లావణ్య పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. గతంలో హీరో రాజ్ తరుణ్‌తో ఉన్న సంబంధం, ఆ తర్వాత అతనిపై చేసిన ఆరోపణలతో ఆమె వార్తల్లో నిలిచారు. వ్యక్తిగత వివాదాలతో తరచూ మీడియా దృష్టిని ఆకర్షించే లావణ్య, ఇప్పుడు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో చిక్కుకోవడం గమనార్హం. 


More Telugu News