కడియం శ్రీహరి నిజాయతీ గల నాయకుడు కాదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేసిన పల్లా... దేవాదుల ఎత్తిపోతల పథకం సృష్టికర్తను తానేనని కడియం చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు.


2004 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేవాదుల ప్రాజెక్టు కోసం కడియం శ్రీహరి చేసింది ఏమీ లేదని పల్లా ఆరోపించారు. అప్పట్లో ఎలాంటి పాత్ర పోషించని వ్యక్తి, ఇప్పుడు తానే సృష్టికర్తనని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కడియం శ్రీహరికి ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇచ్చారని పల్లా గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వంటి కీలక పదవులతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని విస్మరించకూడదన్నారు. కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతోనే ఆయన ఈ స్థాయిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

కడియం శ్రీహరి నిజాయతీ గల నాయకుడు కాదని, బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని పల్లా సంచలన ఆరోపణలు చేశారు. నైతికత గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, సమీకరణలు మారినా తాను జనగామ ప్రజలకు సేవ చేయడం కొనసాగిస్తానని, అక్కడి ప్రజలతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని పల్లా స్పష్టం చేశారు.



More Telugu News