హీరోకు చికిత్స చేయడానికి వచ్చి ‘ధురంధర్’ లో నటుడిగా మారిన డాక్టర్

పంజాబ్ లోని లూధియానాకు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడు అనుకోకుండా బాలీవుడ్ నటుడిగా మారిపోయారు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్ 2’ చిత్రంలో ఆయన ఓ చిన్న పాత్రలో మెరిశారు. నటుడు అర్జున్ రాంపాల్‌కు చికిత్స అందించడం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కడం విశేషం. పఖోవాల్‌కు చెందిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సన్నీ అశోక్ ఇప్పుడు ఈ సినిమాతో స్థానికంగా సెలబ్రిటీ అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. గతేడాది జూలైలో ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌లో జరిగింది. ఓ రైల్వే ట్రాక్‌పై ఛేజింగ్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు నటుడు అర్జున్ రాంపాల్ తలకు గాయమైంది. దీంతో ఆందోళన చెందిన చిత్ర యూనిట్, సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ సన్నీ అశోక్‌ను సెట్స్‌కు పిలిపించారు. ఆయన వెంటనే అర్జున్ రాంపాల్‌ను పరీక్షించి, గాయం తీవ్రమైనది కాదని చెప్పడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది.

డాక్టర్ సన్నీ ప్రొఫెషనలిజం, ప్రశాంతతను చూసి దర్శకుడు ఆదిత్య ధర్ ఇంప్రెస్ అయ్యారు. సినిమాలో హీరో రణవీర్ సింగ్ గాయంతో విమానం దిగే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సీన్‌లో హీరోకి చికిత్స చేసే డాక్టర్ పాత్ర కోసం నిజమైన వైద్యుడే సరిపోతాడని ఆదిత్య భావించారు. వెంటనే ఆయన డాక్టర్ సన్నీని ఆ పాత్రలో నటించమని అడిగారు.

ఈ ఆఫర్‌కు వెంటనే అంగీకరించిన డాక్టర్ సన్నీ, ఆ పాత్రలో ఎంతో సహజంగా నటించారు. మొదటి టేక్‌లోనే షాట్ ఓకే అయింది. కెమెరా వైపు చూడకుండా బాగా నటించారంటూ దర్శకుడు ఆదిత్య ఆయనను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తనను వెండితెరపై చూసి బంధువులు, స్నేహితులు గుర్తుపట్టడంతో డాక్టర్ సన్నీ తన ప్రాంతంలో ఇప్పుడు ఓ సెలబ్రిటీగా మారిపోయారు.


More Telugu News