ఆ దేవుడే ఇప్పుడు వీళ్లందరినీ కాపాడాలి: రామ్ గోపాల్ వర్మ

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం చూసి సౌత్ ఇండియా దర్శకులు, నిర్మాతలు వణికిపోతున్నారంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈ సినిమా రికార్డులను చూసి సౌత్ ఇండస్ట్రీ వాళ్లు అస్సలు సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు.


"'ధురంధర్ 2' రికార్డులు చూశాక, ఇప్పుడు సౌత్ సినిమా వాళ్లంతా గ్రూపులుగా కలిసి తిరుపతి, వైష్ణో దేవి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి దేవుడికి మొక్కుకుంటారు. తమ సినిమాలు ఈ రికార్డులను దాటాలని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్లను కాపాడాల్సింది ఆ దేవుడు మాత్రమే" అని వర్మ తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా మాత్రమే ఈ రికార్డులను బద్దలు కొట్టగలదని వర్మ అభిప్రాయపడ్డారు. ఆ తరహా మేకింగ్ స్టైల్ ఉంటేనే 'ధురంధర్' సృష్టించిన బెంచ్ మార్క్‌ను రీచ్ అవ్వగలమని ఆయన విశ్లేషించారు.

ఈ సినిమాను కొందరు 'ప్రోపగాండా' (ప్రచార చిత్రం) అని విమర్శించడంపై వర్మ మండిపడ్డారు. ఆదిత్య ధర్ తన రీసెర్చ్ ఆధారంగా తనకు నచ్చింది తీశారని, అది ఆయనపై ఆయనకున్న నమ్మకమని కితాబునిచ్చారు. ఒక దర్శకుడిగా తను అనుకున్న పాయింట్‌ను ప్రపంచానికి బలంగా చెప్పడంలో ఆదిత్య సక్సెస్ అయ్యారని కొనియాడారు.

మరోవైపు, కేవలం వారం రోజుల్లోనే 'ధురంధర్ 2' చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కాగా, ఆదిత్య ధర్ మేకింగ్‌కు హాలీవుడ్ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.


More Telugu News