బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్.. వెయ్యి కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో ‘ధురంధర్ 2’

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘ధురంధర్: ది రివెంజ్’ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల‌ 19న విడుదలైన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. దాదాపు 3 గంటల 49 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

26/11 ముంబై ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకునే అండర్‌కవర్ ఆపరేషన్ అనే వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. రణ్‌వీర్ సింగ్ తన ఎనర్జిటిక్ నటన, పవర్‌ఫుల్ యాక్షన్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి నటుల పాత్రలు సినిమాకు మరింత బలాన్నిచ్చాయి. యాక్షన్, దేశభక్తి అంశాలు కలగలిసి ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది.

బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సునామీ.. 
కలెక్షన్ల విషయానికొస్తే, ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల మార్కును దాటేసింది. కేవలం ఇండియాలోనే ఇప్పటివరకు రూ. 687.43 కోట్ల గ్రాస్ సాధించింది. వీక్‌డేస్‌లోనూ దీని జోరు తగ్గలేదు. ఐదో రోజు రూ. 65 కోట్లు, ఆరో రోజైన మార్చి 24న రూ. 56.55 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రజనీకాంత్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి అగ్ర తారలు ఈ చిత్రాన్ని ప్రశంసించడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

హిందీలోనే కాకుండా దక్షిణాది భాషల్లోనూ ‘ధురంధర్ 2’ ప్రభంజనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు 42% ఆక్యుపెన్సీతో రూ. 3.10 కోట్లు వసూలు చేసి, హిందీ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన వెర్షన్‌గా నిలిచింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం మరో ఒకటి రెండు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్‌లో రూ. 2000 కోట్ల మైలురాయిని కూడా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. "ఈ చిత్రాన్ని చూసి హాలీవుడ్ దర్శకులు కూడా నేర్చుకోవాలి" అంటూ రామ్‌గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి.


More Telugu News