అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణం: బెంగళూరులో మేనల్లుడి జీరో ఎఫ్ఐఆర్

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతి కేసు కీలక మలుపు తీసుకుంది. ఇది ప్రమాదం కాదని, ఓ పెద్ద క్రిమినల్ కుట్ర అని ఆరోపిస్తూ ఆయన మేనల్లుడు, ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ మంగళవారం బెంగళూరులో 'జీరో ఎఫ్ఐఆర్' దాఖలు చేశారు. మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలమవడంతోనే తాను ఇక్కడ ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

జనవరి 28న బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కోరుతూ ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని పలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని రోహిత్ పవార్ తెలిపారు. పోలీసులు కేవలం ప్రమాద మృతి నివేదిక (ADR) మాత్రమే పరిశీలిస్తున్నారని చెప్పడంతో, ఆయన బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై రోహిత్ పవార్ తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ విమానం ప్రయాణానికి ఏమాత్రం యోగ్యం కాదని, దాని నిర్వహణ రికార్డులను తారుమారు చేశారని పేర్కొన్నారు. డీజీసీఏ ఆడిట్‌లోనూ ఈ విషయం తేలిందని గుర్తుచేశారు. చివరి నిమిషంలో సిబ్బందిని మార్చడం, పైలట్ సుమిత్ కపూర్ గతంలో మద్యం సంబంధిత ఉల్లంఘనలకు పాల్పడటం, వాతావరణం సరిగా లేకున్నా విమానం నడపడం వంటివి కుట్రకు బలం చేకూరుస్తున్నాయని ఆరోపించారు.

ఇది ప్రమాదం కాదని, "ఉప ముఖ్యమంత్రిని అంతమొందించేందుకు పన్నిన పెద్ద కుట్ర" అని తన ఫిర్యాదులో రోహిత్ పవార్ ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత కింద నిర్లక్ష్యం, హత్యానేరం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. తదుపరి విచారణ కోసం ఈ జీరో ఎఫ్ఐఆర్‌ను పూణెకి బదిలీ చేశారు.


More Telugu News