కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాలాంటి వారి సేవలు అవసరం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే తనలాంటి ఉద్యమకారుల సేవలు అవసరమని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి కోసం తాను పరితపించడం లేదని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ అధిష్ఠానమే గతంలో హామీ ఇచ్చిందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని చెప్పారు.

అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని అన్నారు. తనకు ఏ పదవి లేకపోయినా, ప్రజల్లో తానంటే గౌరవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈరోజు కేటీఆర్‌తోనూ అసెంబ్లీ లాంజ్‌లో సాధారణ విషయాలనే మాట్లాడినట్లు తెలిపారు. 2018లో 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం తప్పేనని కేటీఆర్‌కు చెప్పానని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బందిలేదని తెలిపారు. ముఖ్యమంత్రితో నిన్న ప్రత్యేకంగా భేటీ కాలేదని, ఎదురుపడితే మాట్లాడుకున్నామని స్పష్టతనిచ్చారు. 


More Telugu News