Malla Reddy: అసెంబ్లీలో మల్లారెడ్డి మార్క్ ప్రసంగం.. డంపింగ్ యార్డ్ వాసన భరించలేకపోతున్నానంటూ ఆవేదన!
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గ సమస్యల గురించి ఆయన మాట్లాడుతూ... జవహర్నగర్ డంపింగ్ యార్డ్ దుస్థితిని వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. నగరం నలుమూలల నుంచి వచ్చే చెత్త అంతా తన నియోజకవర్గంలోనే పడుతోందని, ఆ వాసన భరించలేక "నేను ఎందుకు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నానా?" అని బాధపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి మల్లారెడ్డి మాట్లాడుతూ... "శ్రీధరన్న.. జర నన్ను పగబట్టకే.. మా జిల్లా ఇంచార్జ్ మంత్రివి నువ్వే, మా మేడ్చల్ మీద కొంచెం కనికరం చూపించు" అంటూ తనదైన శైలిలో వేడుకున్నారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి జీహెచ్ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని విన్నవించారు. విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.