పశ్చిమాసియాలో ఆగిపోనున్న యుద్ధం.. ఇరాన్ కీలక నిర్ణయం..?

అమెరికా, ఇజ్రాయెల్‌లతో శత్రుత్వం కొనసాగిస్తున్న ఇరాన్ వైఖరిలో అనూహ్య మార్పు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఇజ్రాయెల్, అరబ్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆయన గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే భారీ వినాశనం నుంచి దేశాన్ని కాపాడటంతో పాటు, తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు మొజ్తబా ఈ శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్ దాడుల నుంచి బయటపడాలంటే చర్చలే సరైన మార్గమని ఆయన నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

అయితే, ఈ నిర్ణయానికి ఇరాన్‌లోని సంప్రదాయవాద శక్తులు (హార్డ్‌లైనర్లు), ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, పశ్చిమాసియాలో నెలలుగా సాగుతున్న రక్తపాతం ఆగిపోతుంది. లెబనాన్, గాజా, యెమెన్‌లలోని ఘర్షణలు కూడా సద్దుమణిగే వీలుంది. ఈ పరిణామం ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News