అనంతపురం ఆర్డీటీకి తొలగిన అడ్డంకులు.. ఫలించిన చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు

అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) కు కేంద్ర హోంశాఖ భారీ ఊరటనిచ్చింది. విదేశీ నిధులు పొందేందుకు అవసరమైన ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) అనుమతులను కేంద్రం పునరుద్ధరించింది. సుమారు ఏడాది కాలంగా ఈ నిధుల వినియోగంపై ఉన్న ఆంక్షల వల్ల ఆర్డీటీ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు అంతరాయం కలగగా, ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి.


ఆర్డీటీ ఎదుర్కొంటున్న ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. చంద్రబాబు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి, దశాబ్దాలుగా ఆర్డీటీ చేస్తున్న నిరుపమాన సేవలను వివరించారు. రాష్ట్ర ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ ప్రక్రియ పూర్తయింది. ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని గతంలో ఇచ్చిన హామీని మంత్రి లోకేశ్ నెరవేర్చారు. అనుమతులు వచ్చిన వెంటనే ఆయన సంస్థ నిర్వాహకులు మాంచో ఫెర్రర్‌ కు అభినందనలు తెలిపారు.

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఈ సంస్థ, రాయలసీమలోని వేలాది గ్రామాల్లో పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, వికలాంగులకు పునరావాసం కల్పిస్తోంది. విదేశీ నిధులపై ఆధారపడి నడిచే ఈ సంస్థకు అనుమతులు నిలిచిపోవడంతో వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నిధుల ప్రవాహం మళ్లీ మొదలవ్వనుండటంతో సంస్థ కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడనున్నాయి.


More Telugu News