అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తుళ్లూరు మండలం రాయపూడి వద్ద భారీగా మంటలు ఎగసిపడ్డాయి. రాజధాని పనుల కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిల్వ ఉంచిన పైపులకు నిప్పంటుకోవడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, కొన్ని రోజుల క్రితమే వెలగపూడి సమీపంలో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన కోట్ల విలువైన పైపులు ఇలాగే అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించినప్పటికీ, ఆ దర్యాప్తు పూర్తికాకముందే ఇప్పుడు అదే తరహాలో మరో ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వరుస ఘటనల నేపథ్యంలో ఇవి ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా లేక రాజధాని పనులను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలా అనే కోణంలో చర్చ మొదలైంది. కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్యం కూడా ఒక కారణమై ఉండవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఫోరెన్సిక్ బృందాల సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.


More Telugu News