ఇరాన్‌‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నామని ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 5 రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేస్తున్నామని వెల్లడించారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజులుగా ఇరాన్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు.

"గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని ఆదేశించాను" అని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.

పశ్చిమాసియాలో తాము శాంతికోసం కృషి చేస్తామని ట్రంప్ తెలిపారు. మరోవారం రోజుల పాటు చర్చలు జరిగే అవకాశం ఉందని అన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.


More Telugu News