రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయని హెచ్చరించారు. అమరావతిలో నిర్మించబోయే ప్రతి కట్టడం 'ఐకానిక్'గా ఉంటుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ప్రపంచంలోనే అత్యుత్తమ శాసనసభ కేంద్రంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న అప్పుల గురించి వస్తున్న ఆరోపణలపై మంత్రి నారాయణ స్పష్టమైన వివరణ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన భూముల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతోనే పెండింగ్లో ఉన్న అప్పులను తీరుస్తామని వెల్లడించారు. భూముల విలువ పెరిగేలా మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల కోసం నిర్మిస్తున్న సుమారు 3,500 ఫ్లాట్లు ఈ మార్చి నెలాఖరు కల్లా పూర్తి కానున్నాయని చెప్పారు. సెక్రటేరియట్, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం ఇప్పటికే రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు.