భారత్‌కు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన ఎల్‌పీజీ నౌకలు

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరినప్పటికీ భారత్‌కు ఇంధన సరఫరా విషయంలో పెద్ద ఊరట లభించింది. సుమారు 92,700 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్‌తో వస్తున్న రెండు భారీ భారతీయ నౌకలు ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ఈ నౌకలు ప్రస్తుతం గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా రేవుల వైపు ప్రయాణిస్తున్నాయి.

భారత్‌తో ఉన్న బలమైన దౌత్య సంబంధాల కారణంగా ఇరాన్ ఈ నౌకలకు ప్రత్యేక అనుమతి ఇవ్వడం విశేషం. ఇరాన్ నౌకాదళం ఈ నౌకలకు మార్గనిర్దేశం చేసి భద్రత కల్పించింది. యుద్ధ వాతావరణం నెలకొన్న గల్ఫ్ ప్రాంతంలో భారత ఇంధన భద్రతకు ఇది కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు, దేశంలో ఇంధన ధరల విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లు దాటినా, కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచింది. అయితే, వాణిజ్య అవసరాలకు వాడే బల్క్ డీజిల్ ధరను లీటరుకు రూ.22 వరకు, ప్రీమియం పెట్రోల్ ధరను రూ.2 వరకు పెంచింది. ఈ నిర్ణయం రవాణా, తయారీ రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం దేశంలో 15 నుంచి 20 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో గ్యాస్ సిలిండర్లను ముందస్తుగా బుక్ చేసుకోవద్దని కేంద్ర పెట్రోలియం శాఖ సూచించింది. అమెరికా వంటి దేశాల నుంచి ఎల్‌పీజీ దిగుమతులను పెంచేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సాధారణ ఇంధన ధరలపైనా ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


More Telugu News