మటన్ ఉడకలేదట.. కేసు పెట్టాలంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు

నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌కు ఉగాది పండగ నాడు ఒక వింత 'కేసు' వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్‌తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


అసలేం జరిగిందంటే... ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి ఎంతో ఆశగా వండటం మొదలుపెట్టాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ మటన్ మొండికేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20 విజిల్స్ వచ్చినా ఆ ముక్క మెత్తబడలేదు. ఆకలితో ఉన్న హాజీకి కోపం నషాలానికి అంటింది. వెంటనే గ్యాస్ కట్టేసి, ఆ వేడివేడి కుక్కర్‌ను పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు.

"సార్.. ఇదిగో చూడండి, ఈ మటన్ ఎన్ని విజిల్స్ వేసినా ఉడకడం లేదు. ఆ దుకాణదారుడిపై కేసు పెట్టండి" అంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నవ్వాలో, సీరియస్ అవ్వాలో తెలియక తలలు పట్టుకున్నారు. వంటగది సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చిన హాజీకి నచ్చజెప్పి, అక్కడి నుండి సాగనంపారు.


ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం, నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. "ఆ మటన్ ముక్క బహుశా జిమ్ కెళ్లి బాడీ బిల్డ్ చేసిందేమో, అందుకే అంత గట్టిగా ఉంది" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఇది మటన్ కేసు కాదు.. కుక్కర్ పరువు పోయిన కేసు" అని మరొకరు జోక్ చేశారు. "తాడిపత్రి మటన్ - విజిల్స్ కి కూడా లొంగని మొండి ముక్క" అంటూ మీమ్స్ సందడి చేస్తున్నాయి.



More Telugu News