యుద్ధ భయాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ‌ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. ఈరోజు ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1243.00 పాయింట్లు పతనమై 73,289.96 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 413.85 పాయింట్లు నష్టపోయి 22,700.65 వద్ద ట్రేడ్ అయ్యాయి.

పశ్చిమాసియాలో యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించినా, ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ తెలిపారు. "48 గంటల్లో హ‌ర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అల్టిమేటం ఇవ్వడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే, తమ భూభాగాన్ని ఉల్లంఘించని వారికి జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించడంతో చమురు మార్కెట్‌లో భయాందోళనలు కొంత తగ్గాయి" అని ఆయన వివరించారు.

ప్రస్తుత అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్స్, బాండ్లు, బంగారం, వెండి వంటి అన్ని ఆస్తులపైనా ప్రభావం పడిందని ఆయన అన్నారు. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం కూడా ఈక్విటీల కంటే ఎక్కువగా పతనమైందని గుర్తుచేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పెట్టుబడిదారులు ఆందోళనకు గురికాకుండా సంయమనం పాటించాలని సూచించారు. రూపాయి బలహీనపడటం వల్ల ఫార్మా, ఆటో, ఆటో అనుబంధ రంగాల ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరవచ్చని, ఐటీ రంగం కూడా పుంజుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.


More Telugu News