పాక్ గుండెల్లో దడ పుట్టించిన ‘బ్లాక్ టైగర్’.. ఎవరీ ఒరిజినల్ ధురంధర్?

భారత గూఢచార చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం 'బ్లాక్ టైగర్' రవీంద్ర కౌశిక్. దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఈ అసమాన దేశభక్తుడి వర్ధంతి నేడు (మార్చి 23). ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.

1952లో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో జన్మించిన రవీంద్ర కౌశిక్, ఒక సాధారణ రంగస్థల నటుడిగా జీవితం ప్రారంభించి, తన 23 ఏళ్ల వయసులోనే భారత గూఢచార సంస్థ 'రా' దృష్టిని ఆకర్షించారు. దేశం పిలుపు మేరకు అత్యంత ప్రమాదకరమైన బాధ్యతను స్వీకరించారు. పాకిస్థాన్‌లో గూఢచర్యం కోసం ఆయన అసాధారణ రీతిలో సిద్ధమయ్యారు. ఇస్లాం, ఉర్దూ భాషలపై పట్టు సాధించి 'నబీ అహ్మద్ షాకిర్' అనే కొత్త పేరుతో పాక్‌లో అడుగుపెట్టారు. అక్కడ లా డిగ్రీ పూర్తి చేసి, ఏకంగా పాకిస్థాన్ సైన్యంలోనే చేరారు. తన ప్రతిభతో మేజర్ స్థాయికి ఎదిగి, శత్రుదేశపు సైన్యంలో ఉంటూనే భారత దేశానికి కీలక సమాచారం అందించారు.

1979 నుంచి 1983 మధ్య కాలంలో కౌశిక్ పంపిన సమాచారం వేలాది మంది భారత సైనికుల ప్రాణాలను కాపాడిందని చెబుతారు. ఆయన ధైర్యసాహసాలకు ముగ్ధురాలైన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు 'బ్లాక్ టైగర్' అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. అయితే, మరో ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయన ఆచూకీ బయటపడింది. పాక్ సైన్యానికి చిక్కిన తర్వాత దశాబ్దాల పాటు చిత్రహింసలు అనుభవించినా, దేశ రహస్యాలను మాత్రం బయటపెట్టలేదు.

చివరకు 2001లో ముల్తాన్ జైలులో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా, కౌశిక్ లాంటి నిశ్శబ్ద సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News