పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు

పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి వలకు చిక్కడంతో ఒకే రోజులో లక్షాధికారులయ్యారు. వేటలో భాగంగా దొరికిన రెండు చేపలను కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురాగా, వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటాపోటీగా వేలం పాడారు.

వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా వారి వలకు రెండు భారీ కచ్చిడి చేపలు చిక్కాయి. వాటిని వెంటనే అంతర్వేది హార్బర్‌కు తరలించి వేలం వేశారు. ఇందులో 35 కిలోల బరువున్న ఒక చేప రికార్డు స్థాయిలో రూ.1.20 లక్షల ధర పలికింది. అలాగే, 30 కిలోల బరువున్న మరో చేపను వ్యాపారులు రూ.74 వేలకు కొనుగోలు చేశారు. ఈ రెండు చేపలు ఆడవి కావడంతో ఈ ధర వచ్చిందని, అదే మగ చేపలు దొరికితే ఒక్కోటి రూ.4 లక్షల వరకు పలికేదని మత్స్యకారులు తెలిపారు.

కచ్చిడికి ఎందుకంత ధర..?
'ప్రొటోనిబియా డయాకాంథస్' అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ చేపను 'గోల్డెన్ ఫిష్' అని కూడా పిలుస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉండటానికి దాని ఔషధ గుణాలే ప్రధాన కారణం. ఈ చేప పొట్టలోని గాల్ బ్లాడర్ (స్థానికంగా 'పొట్ట' అంటారు) నుంచి శస్త్రచికిత్సల అనంతరం గాయాలకు వేసే కుట్ల దారాన్ని తయారు చేస్తారు. ఇది సులభంగా శరీరంలో కలిసిపోతుంది. దీంతో పాటు కొన్ని రకాల మందులు, వైన్ల తయారీలోనూ దీని భాగాలను వినియోగిస్తారు.

ఈ చేపలు హిందూ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రాల్లో నదులు సముద్రంలో కలిసే ముఖద్వారాల వద్ద ఎక్కువగా జీవిస్తాయి. మే నుంచి అక్టోబర్ మధ్య గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయి. ఇక్కడి వ్యాపారులు ఈ చేపలను కొనుగోలు చేసి పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో మంచి గిరాకీ ఉండటంతోనే వ్యాపారులు ఎంత ధర వెచ్చించైనా కొనేందుకు ఆసక్తి చూపుతారు.


More Telugu News