Jagan Mohan Reddy: ఇలాంటి వ్యక్తిని సంఘ బహిష్కరణ చేయాలి: జగన్ పై ఎంపీ కలిశెట్టి ఫైర్

TDP MP Kalisetti Criticizes Jagan
షార్ట్స్‌లో చూడండి
సమాజం పట్ల, కన్నతల్లి, తోబుట్టువు పట్ల కనీస కనికరం, గౌరవం లేని వ్యక్తి నాయకుడిగా ఎలా రాణిస్తారని వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటమి తర్వాత కూడా జగన్ తన దుర్మార్గపు ఆలోచనలను మానుకోలేదని, సొంత కుటుంబ సభ్యులపైనే విషప్రచారం చేయిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కుటుంబ బాధ్యత, సామాజిక స్పృహ లేని ఇలాంటి వ్యక్తిని రాజకీయంగా ఓడించడం అనేది చిన్న మాట.. ఆయన్ను సమాజం నుంచే బహిష్కరించాలి" అని కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ తీరు రాష్ట్ర పరువును జాతీయ స్థాయిలో మంటగలుపుతోందన్నారు. కన్నతల్లి విజయమ్మను కోర్టుల పాలు చేస్తూ, తన పేటీఎం బ్యాచ్‌తో ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. సొంత కుటుంబంలోని మహిళలకే రక్షణ ఇవ్వలేని వ్యక్తి, రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించారు. ఇది వారి ఇంటి వ్యవహారం కాదని, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ మనోభావాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర ఆడబిడ్డగా ఎవరికి అన్యాయం జరిగినా అండగా నిలవాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని, జగన్ కుటుంబ సభ్యులకు కూడా తమ నైతిక మద్దతు ఉంటుందని తెలిపారు.

ఉత్తరాంధ్రను ఉత్తుత్తి ఆంధ్రగా మార్చారు

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, 'ఉత్తుత్తి ఆంధ్ర'గా మార్చేశారని అప్పలనాయుడు ఆరోపించారు. అక్కడి వనరులను దోచుకున్నారు తప్ప, యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. కానీ, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువనేత లోకేశ్, బీజేపీ నాయకత్వం రాష్ట్రానికి నాలుగు స్తంభాలుగా నిలబడి ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి అంటే మాటలు కాదని, చేతల్లో చూపిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటే.. జగన్ ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు కళ్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో ఉత్తరాంధ్ర దశ మారుతోందని కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేలా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. సుమారు రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఒక్క పరిశ్రమతోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. 

అలాగే, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ స్టీల్ ప్లాంట్, విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు కళ్ల వంటివని, భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వ్యవస్థలను భ్రష్టుపట్టించే సైకో మనస్తత్వం

కుటుంబ బాధ్యత, సామాజిక స్పృహ లేని జగన్ లాంటి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులను రాబోయే ఎన్నికల్లో ఓడించడం చిన్న మాటేనని, వారిని సమాజం నుంచి బహిష్కరించాలని అప్పలనాయుడు పిలుపునిచ్చారు. సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యకు గురైతే, మొదట గుండెపోటని నాటకమాడి, ఆ తర్వాత 'నారాసుర రక్త చరిత్ర' అంటూ తప్పుడు రాతలు రాయించారని గుర్తుచేశారు. నిందితులను కాపాడటానికి జగన్ ఎందుకు తాపత్రయ పడుతున్నారని నిలదీశారు. 

తిరుమల లడ్డూ ప్రసాదంపై కూడా తన పేటీఎం బ్యాచ్‌తో అబద్ధపు ప్రచారాలు చేయిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అసెంబ్లీకి రాకుండా, నాలుగు గోడల మధ్య కూర్చుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును నోటికొచ్చినట్లు దూషించడం, గతంలో 'నడిరోడ్డుపై కాల్చి చంపండి' అని రెచ్చగొట్టడం జగన్ నైజానికి నిదర్శనమన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదని, ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.


Go Back to Shorts
Jagan Mohan Reddy
Kalisetti Appalanaidu
TDP
Andhra Pradesh Politics
YS Vijayamma
Bhോഗapuram Airport
Arcelor Mittal
Steel Plant
Uttarandhra Development
Chandrababu Naidu

More Telugu News