ఢిల్లీకి తిరిగొచ్చిన పృథ్వీ షా... "మీ అబ్బాయి ఇంటికొచ్చాడు" అంటూ భావోద్వేగం

భారత యువ ఓపెనర్ పృథ్వీ షా తన ఐపీఎల్ ప్రస్థానం మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జట్టు శిక్షణా శిబిరంలో అతడు ఇవాళ‌ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన పునరాగమనంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షాను, ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఆ తర్వాత జరిగిన వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2026 వేలంలోనూ మొదట అతడికి నిరాశే ఎదురైంది. కానీ, చివరి రౌండ్‌లో (యాక్సిలరేటెడ్ ఫేజ్) అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్సే అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసి తిరిగి జట్టులోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలో సొంత గూటికి చేరిన పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 'మన అబ్బాయి ఇంటికి తిరిగొచ్చాడు' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పంచుకుంది. అందులో పృథ్వీ షా మాట్లాడుతూ.. "కోట్లా (అరుణ్ జైట్లీ స్టేడియం) లాంటి ప్రదేశాన్ని ఎవరూ మర్చిపోలేరు. అక్కడి శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని మర్చిపోలేం. కొన్ని కథలు ముగిసిపోవు, తిరిగి వస్తాయి. ఢిల్లీ.. మీ అబ్బాయి ఇంటికి వచ్చేశాడు" అని భావోద్వేగంగా వ్యాఖ్యానించాడు.

2018లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పృథ్వీ షాను ఢిల్లీ జట్టు రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ తరఫున ఏడు సీజన్లలో 79 మ్యాచ్‌లు ఆడిన షా, 23.5 సగటుతో 1,892 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్‌లో ఢిల్లీ జట్టు 14 మ్యాచ్‌లలో 7 విజయాలతో ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఆ జట్టు, ఈ సీజన్‌లోనైనా ఆ కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1న లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.


More Telugu News