డాక్టర్ వందన హత్య కేసు.. టీచర్‌కు జీవిత ఖైదు

కేరళలో సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు వందన దాస్ హత్య కేసులో కొల్లం అడిషనల్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్‌ను అతి కిరాతకంగా హతమార్చిన స్కూల్ టీచర్ జి. సందీప్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జీవితాంతం అతడు జైలులోనే గడపాలని స్పష్టం చేసింది. హత్య నేరానికి ఈ శిక్షతో పాటు, ఇతర నేరాలకు అదనంగా 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

2023 మే 10న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గొడవలో గాయపడిన సందీప్‌ను పోలీసులు వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకురాగా, అక్కడే సర్జికల్ కత్తెరతో డాక్టర్ వందనపై దాడి చేసి 27 సార్లు పొడిచి చంపాడు. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు నాటకమాడినప్పటికీ, పక్కా ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని కోర్టు నిర్ధారించింది.

అయితే, ఈ తీర్పుపై బాధితురాలి కుటుంబం, ప్రాసిక్యూషన్ అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాయి. ఇది "అత్యంత అరుదైన కేసు" (Rarest of Rare) కిందకు వస్తుందని, కాబట్టి ఉరిశిక్షే సరైనదని వారు వాదిస్తున్నారు.  


More Telugu News