యుద్ధ భయంతో.. 147 గుర్రాలను విమానంలో ఐరోపాకు తరలించిన ఖతార్

ఇరాన్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఖతార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశానికి గర్వకారణమైన 147 ఖరీదైన అరేబియా రేసు గుర్రాలను సురక్షితంగా ఐరోపాకు తరలించింది. క్షిపణుల దాడుల భయంకర శబ్దాల నుంచి వాటిని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ రేసింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ క్లబ్ (QREC) తెలిపింది.

ఈ తరలింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ముందుగా గుర్రాలను రోడ్డు మార్గంలో 450 కిలోమీటర్లు దూరంలో వున్న సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చేర్చారు. అక్కడి నుంచి రెండు ప్రత్యేక బోయింగ్ విమానాల్లో బెల్జియంకు తరలించారు. ఈ ప్రయాణంలో గుర్రాల వెంట 90 మంది వైద్యులు, సహాయక సిబ్బంది ఉన్నారు. విమానాల్లో ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ, వాటికి ఆహారం, నీరు అందిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.

ఖతార్ రాజకుటుంబం అరేబియా గుర్రాలను తమ జాతీయ గౌరవానికి, విముక్తి పోరాట స్ఫూర్తికి ప్రతీకగా భావిస్తుంది. అందుకే అక్కడ ఏటా నిర్వహించే 'అమీర్ ట్రోఫీ' రేసులకు అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన బాలిక అయిజా మీర్ ఈ పోటీల్లో రజత పతకం సాధించడం గమనార్హం.

ప్రస్తుతం ఈ గుర్రాలన్నీ బెల్జియంలోని ప్రత్యేక ఫామ్‌హౌస్‌లలో క్వారంటైన్‌లో ఉన్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగి, గగనతలం పునరుద్ధరించబడిన తర్వాతే వాటిని తిరిగి దోహాకు తీసుకువస్తామని క్యూఆర్ఈసీ స్పష్టం చేసింది.


More Telugu News