టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలకు అందించే నిధుల పెంపు

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి) ట్రస్ట్ ద్వారా అందించే ఆర్థిక సాయాన్ని భారీగా పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక్కో ఆలయానికి గరిష్ఠంగా రూ.10 లక్షలు కేటాయించగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 లక్షల వరకు పెంచింది. ఈ కొత్త నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.

సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మారుమూల ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ మార్పులు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పెద్ద ఆలయాల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు నిధులను పెంచారు. కొత్త విధానం ప్రకారం, స్థల విస్తీర్ణం ఆధారంగా నిధులు కేటాయిస్తారు. 5 సెంట్ల స్థలంలో నిర్మించే ఆలయానికి రూ.10 లక్షలు, 8 సెంట్లకు రూ.15 లక్షలు, 10 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మిస్తే రూ.20 లక్షలు మంజూరు చేస్తారు. దీనికి అదనంగా, ప్రహరీ గోడ, ఇతర అలంకరణ పనుల కోసం మరో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కేటాయించనున్నారు. దీంతో ఒక్కో ఆలయానికి అందే మొత్తం సాయం రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండనుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,000 ఆలయాలను నిర్మించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఆలయాల నిర్మాణం కోసం 1,176 దరఖాస్తులు రాగా, వాటిలో 463 ఆలయాలకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయం నిర్మించాలనుకునే స్థానిక కమిటీలు దేవాదాయ శాఖ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


More Telugu News