తల్లిపై అత్యాచారం.. తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య!

మధ్యప్రదేశ్‌లో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తన తల్లిపై జరిగిన లైంగిక దాడిని తట్టుకోలేక 17 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవాస్ జిల్లాలోని ఉదయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భికుపురా గ్రామంలో శనివారం ఈ విషాదం జరిగింది.

గ్రామానికి చెందిన మహిళపై సునీల్ మాలవీయ అనే వ్యక్తి పొలంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు, ఆమె బంధువులు శుక్రవారం రాత్రి ఉదయనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, సున్నితమైన కేసు కావడంతో మహిళా అధికారి అందుబాటులో లేరనే కారణంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కుమారుడు శనివారం ఉదయం పురుగుల మందు తాగాడు. అతడిని వెంటనే బాగ్లీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు, బంధువులు మృతదేహంతో పుంజాపురా-బాగ్లీ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిందితుడి ఇంటిపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. అతడి వాహనానికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు.

సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు భారీ పోలీస్ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడు సునీల్ మాలవీయను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి మహిళా అధికారి లేకపోవడంతోనే ఆలస్యమైందని, ఈలోపే దురదృష్టకర ఘటన జరిగిందని వివరణ ఇచ్చారు. నిందితుడి ఆస్తులపై విచారణ జరిపి, అక్రమ కట్టడాలు ఉంటే కూల్చివేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News