భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారు

టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టు తన తదుపరి సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు బెల్‌ఫాస్ట్ వేదికగా జూన్ 26, 28 తేదీల్లో జరుగుతాయి.

2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి టీ20 సిరీస్ ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2026 ముగిసిన అనంతరం టీమిండియా తొలుత ఆఫ్ఘ‌నిస్థాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20న వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఈ సిరీస్ పూర్తికాగానే జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.

"సీనియర్ పురుషుల జట్టు 2026 జూన్‌లో ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం పర్యటిస్తుంది" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఎనిమిదేళ్లలో భారత్ మూడుసార్లు (2018, 2022, 2023) ఐర్లాండ్‌లో పర్యటించినప్పటికీ 2007 తర్వాత బెల్‌ఫాస్ట్‌లో ఆడటం ఇదే తొలిసారని బోర్డు వివరించింది.

మరోవైపు ఐర్లాండ్ జట్టు కూడా తీరిక లేకుండా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో చారిత్రక టెస్టు మ్యాచ్, భారత్‌తో సిరీస్, ఆ తర్వాత ఆగస్టులో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.

భారత్ - ఐర్లాండ్ సిరీస్ షెడ్యూల్: 
మొదటి టీ20: జూన్ 26 (బెల్‌ఫాస్ట్, భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు) 
రెండో టీ20: జూన్ 28 (బెల్‌ఫాస్ట్, భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు)


More Telugu News