అవినాశ్ రెడ్డి నటన ఆస్కార్ రేంజ్‌లో ఉంది: బీటెక్ రవి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ సెగలు పుట్టిస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌పై పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి నిప్పులు చెరిగారు. కడపలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అవినాశ్ రెడ్డి నటన చూస్తుంటే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్‌లో ఉందని ఎద్దేవా చేశారు.


వివేకా కుమార్తె సునీత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహకరిస్తున్నారన్న అవినాశ్ వ్యాఖ్యలపై బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. "సునీతకు గనుక రాజకీయ కోరిక ఉంటే... ఈరోజు అవినాశ్‌ రెడ్డి కడప ఎంపీ అయ్యేవారు కాదు. ఆ స్థానంలో సునీతమ్మే ఎంపీగా ఉండేవారు. కేవలం తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతోనే ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు తప్ప, ఇందులో రాజకీయాలు లేవు" అని స్పష్టం చేశారు.


వివేకా హత్య జరిగిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను బీటెక్ రవి ఈ సందర్భంగా సూటిగా ప్రస్తావించారు. "స్పాట్ పెట్టింది మీరు. స్పాట్‌కు వెళ్లింది మీరు. అక్కడ దగ్గరుండి సాక్ష్యాధారాలను క్లీన్ చేయించింది కూడా మీరే" అంటూ అవినాశ్‌ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. వివేకా కేసులో ఎన్ని డ్రామాలు ఆడినా, సాక్ష్యాలను తారుమారు చేసినా... చట్టం ముందు అవినాశ్ రెడ్డి దోషిగా నిలబడక తప్పదని, శిక్ష నుంచి ఆయన తప్పించుకోలేరని అన్నారు.



More Telugu News