Kolusu Parthasarathy: నాడు పాదయాత్రలో లోకేశ్ మాట... నేడు జాబ్ క్యాలెండర్‌తో బాట: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathy on Job Calendar Promise Fulfilled
షార్ట్స్‌లో చూడండి
నాడు పాదయాత్రలో యువతకు ఇచ్చిన మాట ప్రకారం, నేడు జాబ్ క్యాలెండర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాటలు వేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగంతో అల్లాడిన యువతకు తమ కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని ఆయన భరోసా ఇచ్చారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

యువతకు 2.3 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్, వారిని నిలువునా వంచించారని మంత్రి తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, గ్రాడ్యుయేట్లలో 24 శాతం మందికి ఉద్యోగాలు లేవని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని గుర్తు చేశారు. ఉపాధి లేక రాష్ట్రంలో 4,100 మంది యువకులు ఆత్మహత్య చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎన్సీఆర్బీ నివేదికను ఉటంకిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 6,28,347 ఉద్యోగాలు కల్పించిందని పార్థసారథి గర్వంగా ప్రకటించారు. ఇప్పటికే 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, తాజాగా మరో 10,060 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. 

సూక్ష్మ, చిన్న పరిశ్రమల ద్వారా 2.5 లక్షల మందికి, జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా 1,46,620 మందికి, ఐటీ, పర్యాటక రంగాల్లో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు చూపించామన్నారు. నాడు పాదయాత్రలో లోకేశ్ ఇచ్చిన మాట ప్రకారం, ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు.

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం

ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని, ఫిబ్రవరి 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని ప్రకటించారు. సిటీ, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో పూర్తి ఉచితంగా, ఇతర బస్సుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చని తెలిపారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. 

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కేవలం 24 గంటల్లోనే రూ.45 కోట్లను ముస్లిం సోదరుల ఖాతాల్లో జమ చేశామని, పోలవరం నిర్వాసితులకు మూడు విడతల్లో రూ.1,943 కోట్ల పరిహారం అందించామని చెప్పారు. "మీసాలు తిప్పి, తొడలు కొట్టినంత మాత్రాన పనులు కావు, చిత్తశుద్ధి ఉండాలి" అని వైసీపీ నేతలకు చురకలు అంటించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ గత ఏడాది 16,000 మంది టీచర్లను నియమించామని, తాజా క్యాలెండర్‌లో 1,500 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.

జగన్‌ది హిందూ ధర్మ పరిరక్షణ కాదు.. భక్షణ: బుచ్చి రాంప్రసాద్

అనంతరం ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా దేవాలయాలపై దాడులు చేయించి, హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్, ఇప్పుడు సాక్షి పత్రికలో 'హిందూ ధర్మ పరిరక్షకుడు' అని ప్రకటనలు ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పులివెందుల యాగంలో తీర్థాన్ని కింద పారబోయడం, ప్రదక్షిణలు చేయకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. 

వైసీపీ ఐదేళ్ల పాలనలో 300 దేవాలయాలపై దాడులు జరిగాయని, రామతీర్థం ఘటన, అంతర్వేది రథం దహనం వంటివి ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడి కోట్లాది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన పాపం జగన్‌దేనని ఆరోపించారు. క్రిస్టియన్‌గా అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి, తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేయని వ్యక్తి హిందూ ధర్మ రక్షకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. చేసిన తప్పులకు క్షమాపణ కోరకుండా అబద్ధపు ప్రచారాలు కొనసాగిస్తే, ప్రజలు ఇచ్చిన 11 సీట్లు కూడా సున్నాకు పడిపోవడం ఖాయమని హెచ్చరించారు.
Go Back to Shorts
Kolusu Parthasarathy
Andhra Pradesh jobs
Job calendar
Chandrababu Naidu
TDP
AP government jobs
Unemployment AP
Nara Lokesh
AP news
YSRCP

More Telugu News