ప్రాణం తీసిన పెంపుడు ప్రేమ.. పిల్లి చనిపోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!

ప్రాణంగా పెంచుకుంటున్న పెంపుడు పిల్లి అనారోగ్యంతో మరణించడంతో డిగ్రీ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ బాధను తట్టుకోలేక హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌ లో ఉంటూ డిగ్రీ చదువుతున్న ఓ యువతి పిల్లిని పెంచుకుంటోంది. ఇటీవల ఆ పిల్లి అనారోగ్యంతో మరణించింది. అప్పటినుంచి ఆ యువతి డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతోంది. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.

గదికి తిరిగివచ్చిన తోటి విద్యార్థినులు, ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో, పిల్లి చనిపోయిన బాధతోనే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలపై ప్రేమ ఉండటం మంచి విషయమే అయినా, దాని కోసం ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరమని కామెంట్లు పెడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే యువత ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News