ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు కీలక ఆదేశాలు

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ ఇకపై ఎలాంటి దాడులు చేయబోదని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ కనుక పొరపాటున అమాయక దేశమైన ఖతార్‌పై మళ్లీ దాడికి పాల్పడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు.

ఇటీవల ఇరాన్‌కు, ఖతార్‌కు మధ్య ఉన్న సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, పొరుగున ఉన్న ఖతార్‌లోని లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) కేంద్రంపై దాడులకు దిగింది. ఈ పరిణామాలపై ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో స్పందించారు. "మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతో వున్న ఇజ్రాయెల్, ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడి గురించి అమెరికాకు ఎలాంటి సమాచారం లేదు. అలాగే, ఈ దాడితో ఖతార్‌కు ఏమాత్రం సంబంధం లేదు" అని ట్రంప్ వివరించారు.

"దురదృష్టవశాత్తు, ఈ నిజాలు తెలియని ఇరాన్, అన్యాయంగా ఖతార్‌లోని ఎల్ఎన్‌జీ ప్లాంట్‌పై దాడి చేసింది" అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు ట్రంప్ స్పష్టమైన సందేశం పంపారు. "ఇరాన్ గనుక ఖతార్‌పై మళ్లీ దాడి చేస్తే, ఇజ్రాయెల్ సహాయం ఉన్నా లేకపోయినా, అమెరికా రంగంలోకి దిగుతుంది. ఇరాన్ మునుపెన్నడూ చూడని శక్తితో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌ను పూర్తిగా పేల్చేస్తాం" అని తీవ్రంగా హెచ్చరించారు.

ఇరాన్ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ఇంతటి విధ్వంసానికి ఆదేశించాలని తాను కోరుకోవడం లేదని, కానీ ఖతార్‌పై దాడి పునరావృతమైతే మాత్రం ఏమాత్రం వెనుకాడబోనని ట్రంప్ స్పష్టం చేశారు. 


More Telugu News