Bharat Taxi: భారత్ ట్యాక్సీ సూప‌ర్‌ సక్సెస్.. డ్రైవర్లకు రూ.35 కోట్ల ఆదాయం

Bharat Taxi Platform Empowers Drivers with Rs 35 Crore Income
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సహకార రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ 'భారత్ ట్యాక్సీ' విజయవంతంగా నడుస్తోందని ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సుమారు రూ.5 కోట్ల పెట్టుబడితో ఇప్పటివరకు డ్రైవర్లకు రూ.35 కోట్లకు పైగా ఆదాయం అందించిందని తెలిపింది. ఈ చొరవ ద్వారా దాదాపు 20,000 మంది డ్రైవర్లు, 200 మంది సహాయక సిబ్బందికి ఉపాధి అవకాశాలు లభించాయని వెల్లడించింది.

ఈ విషయంపై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. డ్రైవర్ల సాధికారత, రవాణా రంగంలో సమ్మిళిత వృద్ధికి భారత్ ట్యాక్సీ ఒక పెద్ద ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంలో డ్రైవర్లను 'సారథులు'గా పిలుస్తారని, వారే యజమానులుగా, నిర్ణయాధికారంలో భాగస్వాములుగా ఉంటారని వివరించారు.

ప్రస్తుత యాప్ ఆధారిత క్యాబ్ సేవల మాదిరిగా కాకుండా భారత్ ట్యాక్సీ సహకార నమూనాలో పనిచేస్తుంది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయకుండా, రైడ్ ద్వారా వచ్చిన పూర్తి ఆదాయాన్ని వారికే అందిస్తుంది. దీనికి బదులుగా డ్రైవర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ ఫీజును వసూలు చేస్తుంది. అలాగే ప్రయాణికుల నుంచి కూడా ట్రిప్ ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారని, ఎలాంటి కన్వీనియన్స్ ఫీజులు గానీ, సర్జ్ ప్రైసింగ్ గానీ ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

'సహకారం ద్వారా సమృద్ధి' అనే లక్ష్యంతో 2025 జూన్ 6న మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద భారత్ ట్యాక్సీని స్థాపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సోమనాథ్, ద్వారక నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దశలవారీగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ డ్రైవర్ల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, అగ్రిగేటర్ మోడళ్లకు గౌరవప్రదమైన ప్రత్యామ్నాయాన్ని అందించిందని ప్రభుత్వం పేర్కొంది.
Go Back to Shorts
Bharat Taxi
Ride hailing platform
Amit Shah
Cooperative society
Driver empowerment
Taxi service
Delhi NCR
Gujarat
Driver income
Transportation

More Telugu News