Tourism: విదేశీ యాత్రలకు యుద్ధం సెగ.. దేశీయ టూర్లకే పర్యాటకుల మొగ్గు!

Tourism Impact of War Shift to Domestic Tours in India
షార్ట్స్‌లో చూడండి
వేసవి సెలవుల్లో యూరప్, అమెరికా వంటి దేశాలను చుట్టేయాలనుకున్న పర్యాటకులు ఇప్పుడు తమ ప్లాన్లను మార్చుకుంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, క్షణక్షణం మారుతున్న పరిస్థితులు ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ప్రాణభయంతో విదేశాల్లో గడపడం కంటే, ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేదా తూర్పు ఆసియా దేశాల వైపు వెళ్లడమో ఉత్తమమని పర్యాటకులు భావిస్తున్నారు.

టూర్ ఆపరేటర్ల లెక్కల ప్రకారం.. ముందస్తుగా విదేశీ ప్యాకేజీలు బుక్ చేసుకున్న వారిలో సుమారు 60 శాతం మంది వాటిని రద్దు చేసుకున్నారు. మరో 20 శాతం మంది వెళ్లాలో వద్దో తేల్చుకోలేకపోతున్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే ధైర్యం చేసి విమానాలు తిరుగుతున్నాయి కదా అని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దుబాయ్, దోహా, అబుదాబి వంటి నగరాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ విషయంలో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

యుద్ధం కారణంగా విమాన మార్గాలను మళ్లించడం, ఇంధన ధరలు పెరగడంతో టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటే సమయం, ఖర్చు రెండూ భారమవుతుండటంతో టూర్ ఆపరేటర్లు కూడా వాటిని సిఫార్సు చేయలేకపోతున్నారు. "ఒకవేళ యుద్ధం ఆగిపోయినా, పర్యాటకుల్లో మళ్లీ నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది" అని ట్రావెల్ రంగ నిపుణుడు ఒకరు పేర్కొన్నాడు.

విదేశీ యాత్రలు రద్దు చేసుకున్న వారంతా ఇప్పుడు దేశంలోని పర్యాటక ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. అయోధ్య, హంపి, వారణాసి, కేరళ, గోవా వంటి ప్రాంతాలకు బుకింగ్‌లు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో లడఖ్, సిమ్లా, రిషికేష్ వంటి చల్లని ప్రదేశాలకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. 
Go Back to Shorts
Tourism
Foreign Tours
Domestic Tours
War Impact
Travel Industry
India Tourism
Europe Travel
Summer Holidays
Travel Trends
Flight Tickets

More Telugu News