Nara Lokesh: పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు నారా లోకేశ్ ఆత్మీయ విందు... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Hosts Dinner for Potti Sriramulu Trust Members
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు ఇచ్చిన ఆత్మీయ విందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని శాఖమూరు పార్క్‌లో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' పేరుతో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, సోమవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేశ్ ఈ విందును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "అమరజీవి త్యాగశిల్పం చాలా బాగుంది, ఎంతో కళగా ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు" అని కొనియాడారు. కేవలం 194 రోజుల్లోనే జెట్ స్పీడ్‌తో విగ్రహ ఏర్పాటును పూర్తి చేసినందుకు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేసిన వారి కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ డూండి రాకేష్‌ను శాలువా, ప్రత్యేక జ్ఞాపికతో లోకేశ్ ఘనంగా సత్కరించారు.

తన యువగళం పాదయాత్ర సమయంలో పొట్టి శ్రీరాములు స్వగ్రామానికి వెళ్లి స్ఫూర్తి పొందానని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. అమరజీవి త్యాగనిరతిని, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కిచెప్పారు. ప్రజల్లో ఆయన చరిత్రపై చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ క్రమంలో, రాబోయే 12 నెలల్లోనే స్మృతివనం, ఫొటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పొట్టి శ్రీరాములు మనవరాలు రేవతి తంగుడు, అనురాధ దేవకి, ఇతర కుటుంబ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ అందరినీ పేరుపేరునా పలకరించి, వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సమావేశం ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది.
Go Back to Shorts
Nara Lokesh
Potti Sriramulu
Arya Vysya
Statue of Sacrifice
Amaravati
Andhra Pradesh
TG Bharat
Dundi Rakesh
Revathi Tangudu
IT Minister

More Telugu News