రామాయపట్నం నుంచి కడపకు రైల్వే లైన్.. కేంద్రం ఓకే చెప్పిందన్న సీఎం చంద్రబాబు

  • రాష్టంలో పోర్టుల ప్రగతిపై చంద్రబాబు సమీక్ష
  • రాష్ట్రాన్ని ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం
  • మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పనులు వేగవంతం చేయాలని సూచన
  • 2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పూర్తికి లక్ష్యం
  • ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు దిశగా ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్‌ను ఒక కీలకమైన ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సచివాలయంలో సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులలో కార్గో కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని స్పష్టం చేశారు.

ఈ మూడు పోర్టుల ద్వారా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల నుంచి సరుకు రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రిఫైనరీ ఏర్పాటు తర్వాత రామాయపట్నం పోర్టు ఒక ప్రధాన కంటైనర్, బల్క్ కార్గో కేంద్రంగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.

పోర్టులకు సమీపంలో పోర్టు టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కూడా అపార అవకాశాలు ఉన్నాయని సీఎం దిశానిర్దేశం చేశారు. రెండో దశలో చేపడుతున్న బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా చూడటమే లక్ష్యమని, తద్వారా ఏపీ ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో అక్కడి ఓడరేవులు ఇబ్బందుల్లో ఉన్నాయని, ఈ తరుణంలో భారత్‌లోని తూర్పు తీర పోర్టులే సురక్షితమన్న భావన బలపడుతోందని సీఎం అన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఏపీ పోర్టులను కార్గో రవాణాలో గేమ్ ఛేంజర్‌గా మార్చాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Ramayapatnam port
Kadapa steel plant
Andhra Pradesh ports
East coast logistics hub
AP maritime board
Fishing harbors
Cargo corridor
Port development
Machilipatnam port

More Telugu News