జగన్ ప్రభుత్వం సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసింది: కాల్వ శ్రీనివాసులు
రాయదుర్గం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేలా, 'జల్ జీవన్ మిషన్' కింద భారీ తాగునీటి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. డి.హీరేహాళ్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. 2019లోనే తాము ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశామని, కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో దీనిని పక్కన పెట్టి సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.
వెనకబడిన రాయలసీమకు దక్కాల్సిన అభివృద్ధిని అడ్డుకున్న జగన్రెడ్డిని ఈ ప్రాంతం నుంచి వెలివేయాలని, ఆయన మళ్ళీ అధికారం దరిదాపుల్లోకి రాకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు మంజూరైనందుకు కృతజ్ఞతగా మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ చిత్రపటాలకు పాలతో అభిషేకం నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు.