రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచినా.. గంభీర్‌కు గంగూలీ అసలు టార్గెట్ ఇదే!

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాడు. అతని మార్గనిర్దేశంలో భారత్ మొదట ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2026 గెలిచి చరిత్ర సృష్టించింది. రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి భారత కోచ్‌గా గంభీర్ రికార్డు నెలకొల్పాడు. అయితే, అతనికి అసలు సిసలు పరీక్ష ఇంకా దూరంలోనే ఉందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. గంభీర్ కోచింగ్‌పై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

2027లో దక్షిణాఫ్రికాలో జరగబోయే 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌ గంభీర్‌కు నిజమైన సవాల్ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. "వైట్ బాల్ క్రికెట్‌లో అతనికి నిజమైన పరీక్ష 2027లో దక్షిణాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌లోనే ఉంటుంది. అక్కడి కఠినమైన పరిస్థితులు అతడిని పరీక్షిస్తాయి. కానీ, తనకున్న జట్టుతో అతను విజయం సాధిస్తాడని నేను నమ్ముతున్నాను" అని గంగూలీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 2023 ప్రపంచకప్‌లో ఫైనల్‌ వరకు అజేయంగా నిలిచి, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన చేదు అనుభవాన్ని గుర్తుచేస్తూ, ఈసారి కప్ గెలవడం ఎంతో కీలకమని అన్నాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉండటంతో గంభీర్‌పై మరింత ఒత్తిడి ఉంటుందని తెలిపాడు.

వన్డే ప్రపంచకప్‌తో పాటు టెస్ట్ క్రికెట్‌లోనూ గంభీర్ తన వ్యూహాలను, జట్టు ప్రదర్శనను మెరుగుపరచుకోవాలని గంగూలీ సూచించాడు. "రెడ్ బాల్ క్రికెట్‌లో అతను ఇంకా మెరుగవ్వాలి. అందుకు పిచ్ గురించి అతిగా ఆలోచించడం మానేయాలి. స్వదేశంలో టర్నింగ్ పిచ్‌లపై ఆడాల్సిన అవసరం లేదు. మంచి వికెట్లు మంచి ఫలితాలను ఇస్తాయి" అని సలహా ఇచ్చాడు. ఇంగ్లండ్ సిరీస్‌ను ఉదాహరణగా చూపుతూ, పిచ్‌పై నియంత్రణ లేనప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూశామని గుర్తుచేశాడు.

అదే సమయంలో గంభీర్‌కు గంగూలీ తన పూర్తి మద్దతు తెలిపారు. "గౌతమ్ చాలా మంచి కోచ్. వైట్ బాల్ ఫార్మాట్‌లో, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో అతను అద్భుతమైన కోచ్. అతని వద్ద చాలా మంచి జట్టు ఉంది," అని ప్రశంసించారు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత గంభీర్ తన పూర్తి దృష్టిని టెస్ట్, వన్డే క్రికెట్‌పై కేంద్రీకరించనున్నాడు.


More Telugu News