'సరిగ్గా ఉరేసుకో'.. భార్యతో భర్త వెటకారం.. చివరకు విషాదం

కళ్లెదుట భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే, అదంతా నాటకమని భ్రమపడి ఓ భర్త వీడియో తీసిన అమానవీయ ఘటన రాజంపేట మండలంలో చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్యాయత్నాన్ని తేలిగ్గా తీసుకున్న భర్త నిర్లక్ష్యం ఆమె ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

వివరాల్లోకి వెళితే... ఒంగోలుకు చెందిన శ్రీరాం శ్రీనివాసులు నందలూరులో లోకోపైలట్‌గా పనిచేస్తున్నాడు. మొదటి భార్య మరణించడంతో, 2016లో నాగిరెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణి(30)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, శ్రీనివాసులుకు ఉన్న మద్యం అలవాటు కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంగా మనస్తాపం చెందిన కృష్ణవేణి చనిపోతానంటూ గత ఆరు నెలలుగా భర్తను హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

గురువారం మరోసారి ఇదే విషయమై గొడవ జరగడంతో కృష్ణవేణి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. కిటికీలోంచి ఇదంతా చూసిన శ్రీనివాసులు... ఆమె తనను బెదిరించడానికే ఇలా చేస్తోందని భావించాడు. వెంటనే తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ, 'కృష్ణా.. సరిగ్గా ఉరేసుకో' అంటూ నవ్వుతూ ఎగతాళి చేశాడు. అదే సమయంలో ఆమె కాలు జారి మంచంపై నుంచి కిందకు పడటంతో ఉచ్చు బిగుసుకుపోయింది.

పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆలస్యంగా గ్రహించిన శ్రీనివాసులు తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశాడు. స్థానికులు వచ్చి చూసేలోపే కృష్ణవేణి ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం బయటకు రావడంతో స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News