నా పాపాలన్నీ ఈ సినిమా కడిగేస్తుంది: రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పాప్యులర్ పొలిటికల్ క్రైమ్ ఫ్రాంచైజీ 'సర్కార్' అభిమానులకు శుభవార్త చెప్పారు. ఈ సిరీస్‌లో నాలుగో భాగం 'సర్కార్ 4' షూటింగ్ వచ్చే నెలలోనే ప్రారంభం కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ముంబైలో జరుగుతున్న రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ ఫెస్టివల్‌లో వర్మ కల్ట్-క్లాసిక్ చిత్రం 'శివ' ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'సర్కార్ 4'తో పాటు 'సిండికేట్' అనే మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. "నా పాపాలన్నింటినీ 'సిండికేట్' సినిమా కడిగేస్తుంది" అని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తన కెరీర్‌ తొలినాళ్లలో తీసిన 'శివ' సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వర్మ పంచుకున్నారు. ఈ చిత్రంలోని కొన్ని షాట్లకు లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ స్ఫూర్తి అని, కథాంశం పరంగా బ్రూస్ లీ నటించిన 'ది వే ఆఫ్ ది డ్రాగన్' నుంచి ప్రేరణ పొందినట్టు చెప్పారు. అలాగే, తన కెరీర్‌లో ఫ్లాపులపై స్పందిస్తూ, "బౌండెడ్ స్క్రిప్ట్‌లతో పనిచేయడం మొదలుపెట్టాకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. స్క్రిప్ట్ చేతిలో ఉంటే, దాన్నే అనుకరిస్తాం. ఎమోషనల్ కంటెంట్‌ను మెరుగుపరిచే అవకాశం తక్కువగా ఉంటుంది" అని విశ్లేషించారు.

ఇక తనకు నచ్చిన ఇటీవలి చిత్రాల గురించి మాట్లాడుతూ 'ధురంధర్' సినిమాను ప్రస్తావించారు. స్పీల్‌బర్గ్ తన ఆల్-టైమ్ ఫేవరెట్ దర్శకుడని, ఇప్పటి తరం వారిలో ఆదిత్య ధర్ అత్యంత ప్రతిభావంతుడని వర్మ ప్రశంసించారు. బుక్‌మైషో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ముంబైలోని పలు వేదికలపై కొనసాగుతోంది.


More Telugu News