హైదరాబాద్‌లో 2,500 కిలోల కల్తీ పెరుగు స్వాధీనం

  • అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పెరుగు కలకలం
  • పోలీసులు, టాస్క్‌పోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ
  • ఈ పెరుగును హోటళ్లు, ఫంక్షన్లకు తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు
గత కొన్నిరోజులుగా కల్తీ నెయ్యి గురించి మనం వార్తలు వింటున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి పట్టుబడింది. తాజాగా, అధికారులు కల్తీ పెరుగును కూడా పట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పాలలో కాస్టిక్ సోడాను వినియోగించి ఈ కల్తీ పెరుగును తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి తనిఖీలు చేపట్టారు. శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

వేడి పాలలో కాస్టిక్ సోడాను వేస్తే అది పెరుగుగా మారుతుంది. ఈ పెరుగును తింటే అనారోగ్యానికి గురవుతారని సంబంధిత అధికారులు వెల్లడించారు. కల్తీ పెరుగు గురించి సమాచారం రాగానే అధికారులు గోడౌన్‌పై దాడి చేశారు. ఈ పెరుగును వివిధ హోటళ్లు, ఫంక్షన్‌లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.


More Telugu News