టీమిండియా ఫ్యాన్స్ దెబ్బకు మా వాళ్లు వణికిపోయారు.. ఆనాటి రహస్యం చెప్పిన అఫ్రిది

  • 2011 సెమీస్‌లో భారత అభిమానుల వల్లే ఓడామని చెప్పిన షాహిద్ అఫ్రిది
  • మొహాలీ ప్రేక్షకుల అరుపులకు తమ బ్యాటర్లు వణికిపోయారని వెల్లడి
  • మంచి ఆరంభం లభించినా ఒత్తిడికి గురయ్యామని గుర్తుచేసుకున్న మాజీ కెప్టెన్
  • కెప్టెన్‌గా గెలుస్తామనుకున్నా సీన్ రివర్స్ అయిందన్న అఫ్రిది  
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఉత్కంఠ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, 2011 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో టీమిండియా చేతిలో ఓటమికి గల ఓ ఆసక్తికరమైన కారణాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తాజాగా వెల్లడించాడు. మొహాలీలో భారత ప్రేక్షకుల మద్దతు సృష్టించిన తీవ్రమైన ఒత్తిడికి తమ బ్యాటర్లు వణికిపోయారని ఆయన గుర్తుచేసుకున్నాడు.

పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. "2011లో చండీగఢ్‌లో భారత్‌తో సెమీఫైనల్ ఆడిన సంగతి నాకు గుర్తుంది. మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేశారు. దీంతో కెప్టెన్‌గా నేను చాలా రిలాక్స్‌గా ఉన్నాను. కచ్చితంగా గెలుస్తామని అనుకున్నాను" అని తెలిపాడు.

అయితే, తొలి వికెట్ పడిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయిందని అఫ్రిది వివరించాడు. "మొదటి వికెట్ పడగానే భారత అభిమానులు ఒక్కసారిగా తమ జట్టులో ఉత్సాహం నింపారు. వాళ్ల అరుపుల ధాటికి మా బ్యాటర్లలో కొందరు వణికిపోవడం నేను గమనించాను. హఫీజ్ ఔటైన తీరును కెప్టెన్‌గా చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ప్రతి బంతికి మా ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఆ హోరులో మేం తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాం" అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. అద్భుతమైన ఆరంభం లభించినా ప్రేక్షకుల మద్దతుతో పుంజుకున్న టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.


More Telugu News