రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు: టీడీపీ ఎంపీ శ్రీ భరత్
- ఈ ఉదయం కన్నుమూసిన కావూరి సాంబశివరావు
- బంజారాహిల్స్లోని నివాసానికి కావూరి భౌతికకాయం
- అంత్యక్రియలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరుకానున్న నేతలు
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతితో తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ రాజకీయ శకం ముగిసింది. ఈ ఉదయం ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల వివరాలను ఆయన మనవడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ శ్రీ భరత్ మీడియాకు వెల్లడించారు.
కావూరి పార్థివ దేహాన్ని నేటి సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్లోని ఆయన స్వగృహానికి తరలించనున్నారు. అభిమానులు, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రేపు ఉదయం వరకు అక్కడే ఉంచనున్నారు. రేపు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు.
ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కావూరి... మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుండి ఐదుసార్లు లోక్సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు నేతలు స్మరించుకుంటున్నారు. రేపు జరగబోయే అంత్యక్రియలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.