ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస... చొక్కాలు పట్టుకున్న కౌన్సిలర్లు

  • కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, బాహాబాహీ
  • నీటి సమస్యపై చర్చించాలని బీజేపీ డిమాండ్
  • కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట
  • ఛైర్‌పర్సన్ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీజేపీ
ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం రసాభాసగా మారింది. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కౌన్సిలర్లు పరస్పరం చొక్కాలు పట్టుకుని, బాహాబాహీకి దిగారు. ఇరు పార్టీల గందరగోళం మధ్యనే ఛైర్‌పర్సన్ అనూష 'అజెండా పాస్' అంటూ ప్రకటన చేసి తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు.

అయితే చర్చ లేకుండానే అజెండాను ఎలా పాస్ చేస్తారని బీజేపీ కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్‌పర్సన్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ కౌన్సిలర్లు బయటకు రాకుండా బీజేపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యంతో ఛైర్‌పర్సన్ బయటకు వచ్చారు. దీంతో దాదాపు మూడు గంటల పాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

కాగా, నీటి సమస్యపై చర్చించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ కౌన్సిలర్ అజయ్, బీజేపీ కౌన్సిలర్ రాకేష్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. పాలకవర్గం సభను నామమాత్రంగా నిర్వహిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.


More Telugu News