ఆత్రేయగారి కోసం వేటూరి అలా చేశారట!

  • తెలుగు సినిమా పాటను పరిగెత్తించిన వేటూరి
  • ఆయనను ఎక్కువగా ప్రోత్సహించిన ఎన్టీఆర్   
  • ఆత్రేయను గురువుగా భావించిన వేటూరి  
  • కొన్ని పాటలను ఆత్రేయ కోసమే రాసిన వైనం 

తెలుగు పాటకు తేనెను అద్దిన పాటల రచయితగా ఆత్రేయ కనిపిస్తారు. తేలికైన పదాలలో లోతైన అర్థాలను పలికించడం ఆయన ప్రత్యేకత. ఇక వేటూరి వచ్చిన తరువాత తెలుగు పాటను అటు అందంగానూ .. ఇటు వేగంగాను పరిగెత్తించారు. అలాంటి వేటూరిని గురించి, ఆయన తనయుడు 'రవి ప్రకాశ్' ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'మొదటి నుంచి కూడా నాన్నగారికి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. అదే ఆయనను పాటల దిశగా నడిపించింది' అని అన్నారు. 

"మా నాన్నగారి శైలి అంటే రామారావుగారికి చాలా ఇష్టం. 'గులే బకావళి' సినిమా పాటలను నాన్నగారితో రాయించాలని రామారావుగారు భావించారు. అయితే ఉద్యోగానికి ఎక్కువ రోజులు సెలవు పెట్టడానికి నాన్నగారు ఆలోచన చేయడం వలన, ఆ అవకాశాన్ని అందుకోలేకపోయారు. ఆ తరువాత కూడా రామారావుగారు ఎప్పటికప్పుడు నాన్నగారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. సినిమా పాటల రచయితలలో అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకునే స్థాయికి నాన్నగారు వెళ్లిపోయారు" అని చెప్పారు. 

"అప్పట్లో రామానాయుడుగారి సినిమాలకు ఆత్రేయగారు రాసేవారు. కానీ ఒకసారి ఆయన దొరక్కపోవడంతో, నాన్నగారిని రాయమని అడిగారు. ఆత్రేయ గారిని గురువుగా భావించిన నాన్నగారు, తాను రాయనని చెప్పారు. కానీ అవకాశం వేరొకరికి వెళుతుందని తెలిసి తానే రాశారు. ఆ పాటకు ఆత్రేయగారి పేరు వేయమనీ .. ఆ డబ్బును ఆయనకే పంపించమని చెప్పారు. ఇలా కొన్ని సినిమాలకు జరిగింది" అని అన్నారు.



More Telugu News