బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోవడంతో మూడేళ్లలో రూ.11,000 కోట్లు వసూలు

  • కనీస నిల్వలు లేనందుకు ప్రైవేటు రంగ బ్యాంకులు వసూలు చేసిన ఛార్జీలు రూ.11 వేల కోట్లు
  • రూ.8 వేల కోట్లు వసూలు చేసిన ప్రభుత్వరంగ బ్యాంకులు
  • పార్లమెంటుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన నిర్మలా సీతారామన్
బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వలు (మినిమం బ్యాలెన్స్) లేని కారణంగా గడిచిన మూడేళ్లలోప్రైవేటు రంగ బ్యాంకులు ఖాతాదారుల నుంచి రూ.11 వేల కోట్లు వసూలు చేసినట్లు కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.8 వేల కోట్లు వసూలుచేసినట్లు తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ప్రైవేటు రంగ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా రూ.3,800 కోట్లు కనీస నిల్వల నిబంధన పేరుతో ఖాతాదారుల నుంచి వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంకు రూ.2,700 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,200 కోట్ల చొప్పున వసూలు చేశాయి.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు అత్యధికంగా రూ.1,500 కోట్లు వసూలు చేయగా, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1,200 కోట్లు, ఇండియన్ బ్యాంకు రూ.1,100 కోట్ల చొప్పున వసూలు చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా, కనీస నిల్వలపై ఎస్బీఐ 2020 మార్చి నుంచి ఛార్జీలు వసూలు చేయడం లేదు. గత ఏడాది నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు కూడా ఈ ఛార్జీలను తొలగించాయి.


More Telugu News