ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
- ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి మినహాయింపునిచ్చిన సుప్రీంకోర్టు
- సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయవద్దని షరతు
- కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం, దేశం విడిచి వెళ్లకూడదని కండిషన్
తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ వెసులుబాటుతో పాటు కోర్టు కొన్ని కఠినమైన షరతులను కూడా విధించింది.
సిట్ విచారణకు ప్రభాకర్ రావు పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసులోని సాక్ష్యాలను గానీ, ఆధారాలను గానీ తారుమారు చేసే ప్రయత్నం చేస్తే బెయిల్ వెంటనే రద్దవుతుందని హెచ్చరించింది. కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం, దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే... గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కేసు నమోదయింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగిందని సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వంటి ఉన్నతాధికారులు అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్నారు.