జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు
- ఈ నెల 14న పిఠాపురంలో జరగాల్సిన వేడుకల రద్దు
- ఎండల తీవ్రత, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం
- జిల్లా, నగర, మండల కేంద్రాల్లో స్థానికంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలన్న పవన్
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ప్రణాళికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 14న పిఠాపురంలో భారీ ఎత్తున వేడుకలను నిర్వహించాలని జనసేన తొలుత నిర్ణయించింది. అయితే, ఆ వేడుకలను రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వాతావరణ పరిస్థితులపై అందిన నివేదికలను దృష్టిలో ఉంచుకుని జనసైనికుల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తొలుత పిఠాపురం వేదికగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావించినప్పటికీ, ప్రతికూల వాతావరణం దృష్ట్యా వ్యూహం మార్చారు. రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభకు బదులుగా, ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా, నగర, మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ స్థానికంగానే ఘనంగా నిర్వహించాలని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. మార్చి 14 అనేది జనసైనికులకు, వీర మహిళలకు ఒక పండగలాంటి రోజని, ఆ ఉత్సాహం తగ్గకుండా స్థానిక స్థాయిలోనే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.
పిఠాపురంలో భారీ సభ రద్దు కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన కార్యాలయాలు పండుగ వాతావరణానికి సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ జెండా ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలతో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.