బంగ్లాదేశ్‌లో హిందూ బాలుడి దారుణ హత్య

  • బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు
  • ఫెనీ జిల్లాలో 16 ఏళ్ల హిందూ బాలుడి దారుణ హత్య
  • ఆటోను ఎత్తుకెళ్లేందుకు యత్నించిన దుండగులు
  • అడ్డుకున్న బాలుడిని హైవేపై వాహనం కిందకి తోసేయడంతో మృతి
  • విచారణ చేపట్టిన బంగ్లాదేశ్ పోలీసులు
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఫెనీ జిల్లాలో ఆటోను దొంగిలించేందుకు యత్నించిన కొందరు దుండగులు, 16 ఏళ్ల హిందూ బాలుడిని దారుణంగా హత్య చేశారు. ఢాకా-చిట్టగాంగ్ హైవేపై లాల్‌పోల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

మృతుడిని శాంతో కుమార్ సాహాగా గుర్తించారు. స్థానిక మీడియా 'జాగోన్యూస్24' కథనం ప్రకారం.. మియాజీ ఫిల్లింగ్ స్టేషన్ ముందు ఆటోలో ప్రయాణికుడి కోసం శాంతో ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి కొందరు దుండగులు అతడిపై దాడి చేసి, ఆటోను లాక్కునే క్రమంలో హైవే పక్కన ఉన్న కల్వర్టు కిందకి విసిరేశారు. అక్కడి నుంచి తేరుకుని దొంగలను వెంబడించిన శాంతోను వారు కదులుతున్న వాహనం కిందకి తోసేశారు. దీంతో వాహనం ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాత్రి వరకు బాలుడి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, తెలిసిన ఆటో డ్రైవర్ ద్వారా సమాచారం అందినట్లు శాంతో బంధువులు తెలిపారు. ప్రయాణికులను ఎక్కించుకున్న ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే నిందితులను గుర్తించవచ్చని వారు కోరుతున్నారు. ఇఫ్తార్ సమయంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని బాలుడిని టార్గెట్ చేసి ఆటోను హైజాక్ చేశారని వారు ఆరోపించారు.

బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ పీ) ప్రభుత్వ హయాంలోనూ హిందూ వర్గాలపై దాడులు ఆందోళనకరంగా పెరుగుతుండటం గమనార్హం. గతంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ 18 నెలల పాలనలోనూ మైనారిటీలపై దాడులు కొనసాగిన విషయం తెలిసిందే.




More Telugu News