వరల్డ్ కప్ విజయం ఆ ఇద్దరికే అంకితం.. కష్టాల్లో అండగా ఉన్న వ్యక్తి గురించి గంభీర్ వ్యాఖ్యలు!

  • టీ20 ప్రపంచకప్ విజయాన్ని ద్రవిడ్, లక్ష్మణ్‌కు అంకితమిచ్చిన గంభీర్
  • కష్టకాలంలో జై షా అండగా నిలిచారంటూ భావోద్వేగ వ్యాఖ్యలు
  • మైలురాళ్ల కన్నా ట్రోఫీలే ముఖ్యమని స్పష్టం చేసిన హెడ్ కోచ్
  • చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు
భారత జట్టు హెడ్ కోచ్‌గా తన తొలి ఐసీసీ ట్రోఫీని గెలిచిన గౌతమ్ గంభీర్ ఈ చారిత్రక విజయాన్ని ఇద్దరు దిగ్గజాలకు అంకితమిచ్చారు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లకు ఈ కప్‌ను అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన కష్టకాలంలో అండగా నిలిచిన ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు.

అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచి భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడారు. "భారత జట్టును పటిష్ఠమైన స్థితిలో ఉంచినందుకు రాహుల్ భాయ్‌కు, భవిష్యత్ తారలను తీర్చిదిద్దుతున్న లక్ష్మణ్‌కు ఈ ట్రోఫీని అంకితం చేస్తున్నా" అని ఆయన పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నిజాయతీతో పనిచేసిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను కూడా ప్రశంసించారు.

తన కోచింగ్ కెరీర్‌లో అత్యంత క్లిష్ట దశ ఎదురైనప్పుడు జై షా తనకు ఎలా ధైర్యం చెప్పారో గంభీర్ గుర్తుచేసుకున్నారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌లు ఓడిపోయినప్పుడు తానెంతో కుంగిపోయానని, ఆ సమయంలో జై షా ఫోన్ చేసి తనపై నమ్మకం ఉంచారని గంభీర్ తెలిపారు. ఆ నమ్మకమే ఈ విజయానికి కారణమని ఆయన పరోక్షంగా వెల్లడించారు.

"మన దేశంలో వ్యక్తిగత మైలురాళ్లను ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. కానీ ట్రోఫీలే ముఖ్యం. ఆ మార్పు కోసమే నేను పనిచేస్తున్నా" అని గంభీర్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ పటిమ తన పనిని సులభతరం చేసిందని కొనియాడారు.


More Telugu News