కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

  • ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు
  • లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు
  • తెలంగాణకు చెందిన నలుగురు లొంగుబాటు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 125 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు, నలుగురు తెలంగాణకు చెందినవారు, మరొకరు ఏపీకి చెందినవారు ఉన్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మావోయిస్టులు ఆయుధాలతో పాటు లొంగిపోయారు. మొత్తం నాలుగు బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న మావోయిస్టులు పోలీసులకు తమ ఆయుధాలను అప్పగించారు.

లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, నూనె నరసింహా రెడ్డి, మల్లా రాజిరెడ్డిల గన్‌మెన్లు ఉన్నారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు, పీఎల్‌జీఏకు చెందిన బెటాలియన్ లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టుల్లో సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె మాధవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచన మేరకు మావోయిస్టులు ఒక్కరొక్కరుగా లొంగిపోతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు స్టేట్ కమిటీ, పదిమంది డివిజనల్ కమిటీ, నలభై మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు చెప్పారు.


More Telugu News