ఎగ్ లెస్ కేక్ కట్ చేశాం: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి
- తిరుమలలో తనూజ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మాధురి
- కేక్ కట్ చేయడంపై విమర్శలు
- భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత
- తమకు నిబంధనలు తెలియవన్న శ్రీనివాస్, మాధురి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల కేక్ కటింగ్ వివాదం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. తిరుమలలో బిగ్బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలు జరపడంపై భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిరుమలలోని గెస్ట్ హౌస్లో కేక్ కట్ చేయడం నియమాలకు విరుద్ధమని టీటీడీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి తిరస్కరించారు. తాము కట్ చేసింది ఎగ్ లెస్ (గుడ్డు లేని) కేక్ అని, అది కూడా నియమ నిబంధనలు తెలియక చేసిన పని అని వారు స్పష్టం చేశారు. తాము శ్రీవారికి పరమ భక్తులమని, తాము ఎలాంటి అపచారం చేయలేదని వారు వాదిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ఇతర అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. కేసులు, విచారణలకు తాము సిద్ధంగా ఉన్నామని, చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా తిరుమలలో రీల్స్ మరియు ఫొటో షూట్ల విషయంలో వీరిద్దరూ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.